
వరలక్ష్మీ వ్రతం… ఈ పేరు వినగానే మహిళల ముఖాల్లో ఆనందం వెల్లివిరుస్తుంది. సిరిసంపదలు, సౌభాగ్యాలను ప్రసాదించే ఈ పవిత్రమైన వ్రతం శ్రావణ మాసంలో అత్యంత భక్తిశ్రద్ధలతో ఆచరిస్తారు. ఈ వ్రతం సంపూర్ణం కావాలంటే వరలక్ష్మీ వ్రత కథను చదవాలి లేదా వినాలి. మనకు ఈ వ్రత కథలోనే వరలక్ష్మీ వ్రత విధానం, వ్రత కల్పం గురించిన విశేషాలన్నీ మహర్షులు వివరించారు.
ఈ సంవత్సరం వరలక్ష్మీ వ్రతానికి, కింద ఉన్న వరలక్ష్మీ వ్రత కథను చదివి మీరు, మీ కుటుంబ సభ్యులు ఆ వరలక్ష్మీదేవి ఆశీస్సులు పొందాలని ఆకాంక్షిస్తున్నాము.
వరలక్ష్మీ వ్రత కథ
సూతమహాముని శౌనకాది మహర్షులను చూసి ఇలా చెప్పారు: “మహర్షులారా, స్త్రీలకు సకల సౌభాగ్యములు, సిరిసంపదలు ఇచ్చే ఒక వ్రతాన్ని సాక్షాత్ ఆ పరమేశ్వరుడే పార్వతీదేవితో చెప్పారు. ఆ వ్రతం గురించి మీకు వివరిస్తాను వినండి.”
పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించిన వరలక్ష్మీ వ్రత మహత్యం
సూతమహాముని శౌనకాది మహర్షులను చూసి ఇలా చెప్పారు: “మహర్షులారా, స్త్రీలకు సకల సౌభాగ్యములు, సిరిసంపదలు ఇచ్చే ఒక వ్రతాన్ని సాక్షాత్ ఆ పరమేశ్వరుడే పార్వతీదేవితో చెప్పారు. ఆ వ్రతం గురించి మీకు వివరిస్తాను వినండి.”
కైలాస పర్వతమున ఆ పరమేశ్వరుడు కూర్చొని ఉండగా, పార్వతీదేవి వచ్చి స్వామికి నమస్కరించి ఇలా అడిగెను: “దేవా! లోకములో ఏ వ్రతం చేస్తే స్త్రీలందరికీ సకల సౌభాగ్యాలు, పుత్రపౌత్రాదులు, సిరిసంపదలు కలుగుతాయో నాకు చెప్పగలరు” అని ప్రార్థించెను. అప్పుడు ఆ పరమేశ్వరుడు ఇలా పలికెను: “దేవి! స్త్రీలకు సకల సౌభాగ్యములు కలగజేసే వ్రతం ఒకటి ఉన్నది. అదే వరలక్ష్మీదేవి వ్రతం.”
ఆ వ్రతమును శ్రావణ మాసంలో శుక్ల పక్షంలో వచ్చే పౌర్ణమి తిథికి ముందు వచ్చే శుక్రవారం రోజున చేయవలెను అని చెప్పగా, పార్వతీదేవి ఇలా అడిగెను: “ఓ లోకరక్షకా! ఈ వ్రతమును ఎలా చేయవలెను? వరలక్ష్మీ వ్రత విధానము ఏమిటి? ఏ దేవతను ఆరాధించవలెను? ఇంతకుముందు ఈ వ్రతమును ఎవరైనా ఆచరించారా? దీని గురించి నాకు వివరించగలరు” అని ప్రార్థించెను.
అప్పుడు పరమేశ్వరుడు పార్వతీదేవిని చూసి “ఓ కామాక్షి! వరలక్ష్మీ వ్రతం గురించి సవిస్తరముగా చెబుతాను వినుము. పూర్వము మగధ దేశమున కుండినంబమనే పట్టణం ఉన్నది. ఆ పట్టణము బంగారు ప్రాకారములతోనూ, బంగారు గోడలు కలిగిన ఇళ్లతోనూ ఉండేది.”
చారుమతి వృత్తాంతం: వరలక్ష్మీ వ్రతానికి పునాది
ఆ పట్టణము నందున చారుమతి అనే బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆ వనితామణి భర్తను దైవముగా భావించి పూజించేది. రోజూ తెల్లవారుజామునే లేచి, స్నానమాచరించి, పూజాది కార్యక్రమాలు చేసి, అత్తమామలకు అనేక సేవలు చేసి, ఇంటి పనులు చేసుకుని, మితముగా, ప్రియముగా మాట్లాడుతూ అందరితో సఖ్యముగా ఉండేది. ఇటువంటి ఉత్తమ గుణములు ఉన్న చారుమతి యందు, వరలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలిగింది.
ఒక నాడు చారుమతి స్వప్నము నందు వరలక్ష్మీదేవి కనిపించి ఇలా పలికెను: “ఓ చారుమతీ! నేను వరలక్ష్మీదేవిని, నీ యందు నాకు అనుగ్రహం కలిగి ప్రత్యక్షమైతిని. నీవు శ్రావణ శుక్లపక్ష పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం రోజున నన్ను పూజిస్తే నీకు, నీ వారికి సకల సౌభాగ్యాలు, సిరిసంపదలు కలుగుతాయి” అని పలకగా, చారుమతి ఆ స్వప్నంలోనే వరలక్ష్మీదేవి చుట్టూ ప్రదక్షిణ, నమస్కారము చేస్తూ ప్రార్థించెను.
శ్లో!! నమస్తే సర్వలోకానాం, జనన్యై పుణ్య మూర్తయే!
శరణ్య త్రిజగద్వంద్వే విష్ణు వక్షస్థలాలయ్యే !!
అనేక విధములుగా స్తోత్రము చేసి “ఓ జగజ్జననీ! నీ కటాక్షం కలిగిన జనులు విద్వాంసులను, సకల భాగ్యాలు పొందుతారు. నేను పూర్వజన్మలో చేసుకున్న ఏ పుణ్యఫలము వలనో మీ దర్శన భాగ్యం నాకు కలిగినది” అని ప్రార్థించెను. అంతట వరములిచ్చి వరలక్ష్మీదేవి అంతర్ధానం అవగా, చారుమతికి మెలకువ వచ్చెను. తన చుట్టూ చూసుకొని అది స్వప్నమని తెలుసుకొని, భర్తకు, అత్తమామలకు తనకు వచ్చిన స్వప్నం గురించి వివరించెను. వారు ఎంతో సంతోషించి, శ్రావణ మాసంలో ఈ వ్రతమును తప్పక చేద్దామని చెప్పారు. చారుమతి స్వప్నం గురించి తెలుసుకున్న ఇతర స్త్రీలు కూడా శ్రావణ మాసం ఎప్పుడు వస్తుందా, ఈ వ్రతమును ఎప్పుడు చేద్దామా అని ఎదురు చూశారు.
చారుమతి, ఇతర స్త్రీలు వరలక్ష్మీ వ్రతం ఆచరించుట
ఇలా ఉండగా వీరి భాగ్యము వలన శ్రావణ మాస శుక్లపక్ష పూర్ణిమ ముందు శుక్రవారం వచ్చింది. అంతట చారుమతి, ఇతర స్త్రీలు “ఈ రోజే కదా వరలక్ష్మీదేవి వ్రతం చేయమని చెప్పినది” అనుకొని ఆ రోజు తెల్లవారుజామునే లేచి, తలస్నానం చేసుకొని, శుభ్రమైన వస్త్రములను ధరించి, చారుమతి యొక్క గృహములో ఈశాన్యం మూలన గోమయంతో అలికి, ఒక మండపమును ఏర్పాటు చేసి, దాని పైన కొత్త బియ్యమును పోసి, మర్రి చిగుళ్లు, పంచపల్లవాలతో (బిల్వం, తులసి, వేప, రావి, మామిడి) కలశమును ఏర్పాటు చేశారు. అందులోనికి వరలక్ష్మీదేవిని ఆవాహన చేసి, చారుమతి మొదలైన స్త్రీలందరూ మిక్కిలి భక్తి శ్రద్ధలతో సాయంకాలమున:
శ్లో!! పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే!
నారాయణ ప్రియే దేవి సుప్రీతా భవసర్వదా!!
అనే శ్లోకము చెప్పి ధ్యాన, ఆవాహనాది షోడశోపచారములతో అమ్మవారిని పూజించి, తొమ్మిది సూత్రములు కలిగిన తోరంబును వారి కుడిచేతికి కట్టుకొని, వరలక్ష్మీదేవికి అనేక విధమైన నైవేద్యాలను సమర్పించి, ఆ మండపము చుట్టూ ప్రదక్షిణ చేశారు.
- మొదటి ప్రదక్షిణ ముగియగానే వారి కాళ్ళ యందు గళ్ళు గళ్ళు మంటూ మంజీరములు, ఇతర ఆభరణములు ప్రత్యక్షమయ్యాయి.
- వారు మిక్కిలి సంతోషించి రెండో ప్రదక్షిణ చేయగానే వారి చేతులకు నవరత్నాలతో కూడిన బంగారు హస్తాభరణములు ప్రత్యక్షమయ్యాయి.
- వారు మరింత ఉత్సాహంతో మూడో ప్రదక్షిణ పూర్తి చేయగా వారు సర్వాభరణ అలంకృత లయ్యారు.
అంతట చారుమతి మొదలైన స్త్రీల ఇళ్లలో సర్వాభరణములు, రథ, గజ, తురగ వాహనములు నిండి ఉండెను. ఆ స్త్రీలందరినీ తీసుకు వెళ్ళడానికి వారి వారి ఇళ్ల నుండి రథములు, గుఱ్ఱములు వచ్చి చారుమతి ఇంటి దగ్గర ఉండెను.
అప్పుడు చారుమతి, ఇతర స్త్రీలు ఈ వ్రతమును కల్పోక్తంగా తమతో చేయించిన బ్రాహ్మణులకు గంధపుష్పాలతో పూజించి, 12 ఉండ్రాళ్ళను, దక్షిణ, తాంబూలాదులను ఇచ్చి నమస్కరించి, ఆ బ్రాహ్మణుని ఆశీర్వాదం పొంది, ఆ వరలక్ష్మీదేవికి నివేదించిన నైవేద్యమును బంధుమిత్రులతో కలిసి భుజించినారు.
తరువాత వారి కొరకు వచ్చిన వాహనములను ఎక్కి వారి ఇళ్లకు వెళుతూ ఒకరితో ఒకరు “ఓహో! చారుమతీదేవి ఎంతటి భాగ్యవంతురాలు కదా, సాక్షాత్ ఆ వరలక్ష్మీదేవియే ఆవిడ స్వప్నంలో వచ్చి ఈ వ్రతము గురించి చెప్పినది” అని చారుమతిని మిక్కిలి కొనియాడుతూ వారు ఇళ్లకు చేరినారు. అప్పటినుండి చారుమతి, ఇతర స్త్రీలు ప్రతియేటా ఆ వరలక్ష్మీదేవి వ్రతమును చేస్తూ అష్ట ఐశ్వర్యములతో, భోగ భాగ్యాలతో తులతూగుతూ ఉన్నారు.
కావున ఓ పార్వతీ! ఈ వ్రతమును నాలుగు వర్ణముల వారు చేయవచ్చును. అలా చేసినచో వారికి సకల సుఖములు, సౌభాగ్యములు ఆ వరలక్ష్మీదేవి యొక్క అనుగ్రహముతో కలుగుతాయి. ఈ కథని ఎవరైతే వింటారో, చదువుతారో వారికి ఆ వరలక్ష్మీదేవి అనుగ్రహం వలన సకల కార్యాలు సిద్ధిస్తాయి.
మీరు కూడా ఈ వరలక్ష్మీ వ్రత కథను చదివి, వ్రతాన్ని ఆచరించి, ఆ వరలక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందుతారని ఆశిస్తున్నాము. ఈ వ్రతం గురించి మీకు ఇంకేమైనా సందేహాలు ఉన్నాయా?






